29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది టీటీడీ. ఉత్సవాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుందని తెలిపింది టీటీడీ. ఇదిలా ఉండగా ఈ ఉత్సవాలలో గజ వాహన, గరుడ వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ. శరత్. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, నరసింహమూర్తి, విజివో గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.







