తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక
హైదరాబాద్ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగోల్ ప్రాంతానికి చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పగడోజు సంగీత తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆమె తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పగడోజు సంగీతను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా టీఆర్పీ ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ లక్ష్యంతో పార్టీలో చేరుతున్న ప్రతి నాయకుడిని స్వాగతిస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయని చెప్పారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు వస్తున్నారని అన్నారు.
పగడోజు సంగీత మాట్లాడుతూ మల్లన్న నాయకత్వంపై విశ్వాసంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ఈ వేదికలో భాగమవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ ,నాయకురాలు మీనా, పావని, శ్రీనిధి పాల్గొన్నారు.





