కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్
న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు లీక్ కావడం పై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. దేశ రాజధాని న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వేదికగా నిరసన ప్రదర్శన చేపట్టింది. కేంద్రంలో గత 12 ఏళ్ల బీజేపీ పాలనా కాలంలో 89 సార్లు పరీక్షలు లీక్ అయ్యాయని ఆరోపించారు సీజేపీ నేతలు, ప్రజాస్వామికవాదులు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బేషరతుగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి. తాను ఎందుకు రిజైన్ చేయాలంటూ ఎదురు ప్రశ్న వేశారు. తనకు లీకులకు ఏం సంబంధం అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్నప్పటికీ, ఈ ప్రచారానికి మద్దతు ఇస్తున్న శక్తులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి ఉద్యమం వెనుక ఉన్నవారు ఎవరు? అని ఆయన అన్నారు. అంతే కాకుండా, ఈ వ్యంగ్య ప్రచార బృందం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ‘బి-టీమ్’ (B-team)గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.






