హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి (టీఎఫ్ పీసీ ) ఎన్నికల కోసం. విశ్వసనీయ వర్గాల మేరకు వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనున్నట్టు టాక్. మండలి సర్వసభ్య సమావేశం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతాయని, ప్రముఖ నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా సర్వసభ్య సమావేశం జరుగుతుంది, ఆ తర్వాత సెప్టెంబర్ 6న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పోటీ చాలా హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది అని పరిశ్రమ వర్గాల ప్రతినిధి ఒకరు తెలిపారు. 2023లో ఎన్నికైన ప్రస్తుత టీఎఫ్పీసీ కార్యవర్గానికి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికలు మండలి నాయకత్వంలో గణనీయమైన మార్పులను తీసుకు రావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్, గతంలో మండలికి నాయకత్వం వహించిన ప్రముఖులలో ఒకరు. ప్రస్తుత కార్యవర్గంలో కె. అశోక్ కుమార్ , వై. సుప్రియ ఉపాధ్యక్షులుగా; గత 17 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్న టి. ప్రసన్న కుమార్ , వై.వి.ఎస్. చౌదరి కార్యదర్శులుగా; నట్టి కుమార్, భరత్ చౌదరి సంయుక్త కార్యదర్శులుగా; టి. రామ సత్యనారాయణ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత కమిటీ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలతో సత్సంబంధాలను కొనసాగించింది. గత కొన్నేళ్లుగా నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు, సినిమా షూటింగ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ఇది సహాయ పడింది. పలువురు ప్రభావవంతమైన నిర్మాతలు పోటీలో దిగే అవకాశం ఉన్నందున, సెప్టెంబర్ 6న జరగబోయే ఎన్నికలు ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తికరమైన ఎన్నికలుగా నిలిచే అవకాశం ఉంది.















