అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రంలో ఏలిన వైసీపీ సర్కార్ నిర్వాకం కారణంగా 100 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లి పోయిందన్నారు. సచివాలయంలో ఆయా శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టారు. కూటమి సర్కార్ వచ్చాక పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు సీఎం. వనరుల్ని సమర్ధంగా వినియోగించు కోవాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని పారిశ్రామికంగానూ అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన్నారు. రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ వనరులు, కోస్తా జిల్లాల్లో ఆక్వా ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం.
రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, చీమకుర్తి గ్రానైట్ సహా విలువైన వనరులకు వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన వద్ద ఉందన్నారు. దానిని అంది పుచ్చుకునే నాయకత్వం మనకు కావాల్సిన అవసరం ఉందన్నారు. పాలసీలు తీసుకు రావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఇక నుంచి నెల వారీ ఆర్ధిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతీ నెలా ఓ మారు కార్యదర్శులు, హెచ్వోడీల సమావేశం నిర్వహించు కోవటం ద్వారా పురోగతిని సమీక్షించుకుందాం అని పేర్కొన్నారు.





