అమరావతి : గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.






