గుడిపాటికి ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా మహాకవి దాశరథి పురస్కారం అందచేస్తూ వస్తోంది. ఈసారి కూడా ఈ ఏడాది సీనియర్ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు గుడిపాటిని ఎంపిక చేసింది. ఈనెల 22వ తేదీ దాశరథి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందని తెలిపింది సర్కార్. దాశరథి పురస్కారం కింద జ్ఞాపిక, ప్రశంసా పత్రం, లక్షా వెయ్యి నూట పదహార్లు నగదుతో సత్కరిస్తారు. ఈ అవార్డు ఎంపిక కోసం ప్రతి ఏడాది ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి రచయిత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.
ఇందులో రచయిత డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవి జయరాజు, కవి డా. యాకూబ్, కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి సభ్యులుగా వున్నారు. గుడిపాటి వెంకటేశ్వర్లు పూర్తి పేరు అయినప్పటికీ గుడిపాటిగా సాహిత్య రంగంలో గుర్తింపు పొందారు. వార్త సండే డెస్క్ ఇంచార్జ్ గా చాలా కాలం పని చేశారు. ఎంత సౌమ్యంగా వుంటారో ఆయన రాతలు అంతగా సూటిగా లోతైన విశ్లేషణలతో ఉంటాయి. ఎక్కడా రాజీపడని రచనలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. ఎన్నో ఏళ్లుగా సాహిత్యంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు ఎంపిక కమిటి వెల్లడించింది.