రెఫరల్ ఆస్పత్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ దశల వారీగా త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన MRI యంత్రాన్ని సమకూర్చు కుంటున్నామని, త్వరలోనే ప్రజలకు MRI సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) మరియు సబ్-సెంటర్ల పనితీరుతో పాటు ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధుల సూచనలు, ఆసుపత్రుల అభివృద్ధి , రోగుల అవసరాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం గణనీయంగా పెరిగిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్ (NIMS), గాంధీ, ఉస్మానియా ,నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పడకల (beds) కోసం ప్రతిరోజూ డజన్ల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తుంటాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రులపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించ వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. అంకాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి, అక్కడ PHCని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నాందేడ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా (CHC) అప్గ్రేడ్ చేయడం , అక్కడ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం వంటి ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు , ఏరియా ఆసుపత్రులలో ఇటీవల 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు , 22 మంది శిశువైద్య నిపుణులను నియమించినట్లు తెలిపారు. అలాగే, సుమారు 330 మంది నర్సింగ్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చినట్లు చెప్పారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ వంటి విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని, జిల్లాలో వైద్యులు ,సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.