newsseals.com

రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ధాన్యం సేకరణ

August 4, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రైతుల ప్రయోజనాలను కాపాడటం , ప్రజల డబ్బుతో సేకరించిన ప్రతి గింజకూ పూర్తి లెక్కలు ఉండేలా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ విధానాలపై సమగ్ర సమీక్షను ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ నిల్వల దుర్వినియోగంపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. సేకరణ, నిల్వ, మిల్లింగ్, బియ్యం పంపిణీ, ప్రభుత్వ బకాయిల వసూలు , నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు వంటి అంశాలను పరిశీలించడానికి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమీక్ష మొత్తం రైస్ మిల్లింగ్ పరిశ్రమకు వ్యతిరేకం కాదు. దశాబ్దాలుగా ప్రభుత్వంతో నిజాయితీగా పనిచేస్తూ, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు , ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)కు గణనీయమైన సహకారం అందించిన వందలాది మంది రైస్ మిల్లర్లు తెలంగాణలో ఉన్నార‌ని అన్నారు మంత్రి. వారి సహకారాన్ని ప్రభుత్వం విలువైనదిగా భావిస్తుందని చెప్పారు. అయితే, కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని గత కొన్నేళ్లుగా ఉల్లంఘించారన్నది కూడా వాస్తవం అన్నారు. ఈ ఉల్లంఘనల వల్ల రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది అని వాపోయారు. చివరికి తెలంగాణ ప్రజలకు చెందిన ప్రజా ధనంపై ప్రభావం పడింద‌ని ఆరోపించారు.

Related News