గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా హైదరాబాద్ : సీఎం
లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’ (జ్ఞాన కేంద్రం) నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ఉన్న అద్భుతమైన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు కె. రామకృష్ణ రావు , జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.
కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన మార్కెటింగ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే విద్యా సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట్ గండికోట (ఫ్రూగల్ AI కో-చైర్) తెలంగాణతో భాగస్వామ్యం ఏర్పరచు కోవడంపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలను అందించడం, ఉమ్మడి పరిశోధనలు చేపట్టడం, అలాగే పారిశ్రామికత (entrepreneurship) ,ఇంక్యుబేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలతో కూడిన సహకార విధానాన్ని రూపొందించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తమ ప్రభుత్వం అన్ని రంగాలలో కీలకమైన సంస్కరణలను తీసుకు వచ్చిందన్నారు. ప్రధానంగా విద్యా పరంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.