హైదరాబాద్ : ‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్ట్లోని ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం జరిగినందుకు కొనుగోలుదారులకు 10.70% వార్షిక వడ్డీని చెల్లించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) వాసవి రియల్టర్స్ను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేస చట్టబద్ధమైన స్వాధీనాన్ని కొనుగోలుదారులకు అప్పగించాలని అథారిటీ డెవలపర్ కు స్పష్టం చేసింది. అదే డెవలపర్పై ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటికే 50కి పైగా ఫిర్యాదులు అందాయని పేర్కొంది అథారిటీ. RERA చట్టంలోని సెక్షన్ 63 కింద చర్యలు తీసుకుంటామని బిల్డర్ను హెచ్చరించింది.
‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్ట్లో ₹1.0395 కోట్లకు ఫ్లాట్ నంబర్ E61008ను కొనుగోలు చేసిన ఆలూరి రమేష్ , కనకమేడల తేజస్వి దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆగస్టు 25న ఈ ఆదేశం జారీ చేసింది తెలంగాణ రెరా. అమ్మకపు ఒప్పందం (sale deed) కుదుర్చుకున్న తేదీ అయిన నవంబర్ 29, 2022 నుండి చట్టబద్ధమైన స్వాధీనం వాస్తవంగా అప్పగించే వరకు కొనుగోలుదారులు వడ్డీని పొందేందుకు అర్హులని TG RERA స్పష్టం చేసింది. కొనుగోలుదారులు వాస్తవంగా చెల్లించిన మొత్తాలపై వార్షికంగా 10.70% వడ్డీని చెల్లించాలని అథారిటీ ఆదేశించింది. ఒకవేళ చెల్లించేందుకు ఆలస్యమైనా మరోసారి వడ్డీ కింద జరిమానా విధిస్తామని హెచ్చరించింది.







