హైదరాబాద్ :సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా (Additional Director) పదోన్నతి పొందారు. పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి డి.ఎస్. జగన్కు పదోన్నతి సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంతో పాటు ప్రభుత్వం, ప్రజలు, మీడియా మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
అనంతరం డి.ఎస్. జగన్ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డా. జి. ముకుంద రెడ్డి ని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ఆయనకు పదోన్నతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదనపు సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన డి.ఎస్. జగన్ మాట్లాడుతూ తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయడంలో శాఖ అధికారులతో సమన్వయంతో పని చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది డి.ఎస్. జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.





