ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేష్ ..?
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి తప్పుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6న ఎన్నికలు జరగనుండగా, సుమారు 800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుండి నిర్మాత బండ్ల గణేష్ తప్పుకున్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుండి వైదొలిగారు అని ఒక వర్గం పేర్కొంది. దీంతో సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది; ఆయనకున్న అపారమైన అనుభవం పరిశ్రమ సమస్యలను పరిష్కరించడంలో సహాయ పడుతుంది అని పేర్కొంది. ‘మన ప్యానెల్’ ‘గిల్డ్ ప్యానెల్’ మధ్య పోరుతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల సమరం వేడెక్కనుంది.
కౌన్సిల్ సభ్యత్వంలో దాదాపు 70% వాటా కలిగిన చిన్న నిర్మాతలకు అండగా నిలవడం వల్ల సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి ప్రసన్న కుమార్ , మోహన్ వడ్లపట్లలకు సానుకూలత ఉంది అని ఆ వర్గం తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని నిర్మాతలు నెలల తరబడి డిమాండ్ చేసిన తర్వాత, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సెప్టెంబర్ 6న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌన్సిల్ ఎన్నికలలో సాధారణంగా ప్రముఖ నిర్మాతలు, చిన్న నిర్మాతల ప్రతినిధుల మధ్య పోటీ ఉంటుంది; ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. సి. కళ్యాణ్ ప్యానెల్ కూడా రూపుదిద్దుకుంది. ఇందులో కార్యదర్శి పదవికి తుమ్మలపల్లి ప్రసన్న కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీ చేస్తుండగా, సంయుక్త కార్యదర్శి పదవికి అమ్మిరాజు , రామ సత్యనారాయణ బరిలో ఉన్నారు. కోశాధికారి పదవికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.