కర్ణాటకలో ‘ప్రజాసేవ అభియాన్ కు శ్రీకారం
కర్ణాటక : కర్ణాటకలో ‘ప్రజాసేవ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం డీకే శివకుమార్ . ‘ప్రజాసేవ అభియాన్’ అనేది పౌరుల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే లేదా నిర్ణీత గడువులోగా పరిష్కారాలను అందించే లక్ష్యంతో రూపొందించిన ఒక సమగ్ర వ్యవస్థ. శనివారం కుడ్లిగి హోబ్లీ నుండి ‘ప్రజాసేవ అభియాన్’ అనే ప్రజా అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిపాలనను ప్రజల ముంగిటకే తీసుకు రావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ప్రజాసేవ శాఖ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నెలా మొదటి , మూడవ శనివారాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన తాలూకా ప్రధాన కార్యాలయాల్లో సమావేశాలు జరుగుతాయి. రెండవ , నాల్గవ శనివారాల్లో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన తాలూకా లేదా హోబ్లీ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
సమావేశాల గురించి కనీసం 15 రోజుల ముందే పౌరులకు సమాచారం అందించ బడుతుందని ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా తాలూకా లేదా హోబ్లీ పరిధిలోని నివాసితులకు AI-ఆధారిత కాల్ సెంటర్ నుండి ఫోన్ కాల్స్ (అవుట్బౌండ్ కాల్స్) వస్తాయని, వీటి ద్వారా సమావేశం తేదీ, సమయం, వేదిక , అధ్యక్షత వహించే ప్రజాప్రతినిధి వివరాలు తెలియ జేయబడతాయని అధికారులు పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వంలోని వివిధ శాఖలు అందించే సేవలు , పథకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడటానికి, ‘ప్రజాసేవ శాఖ’ పరిధిలో ఒక ‘సమగ్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ (Integrated Public Grievance Redressal System) రూపొందించ బడిందని పేర్కొన్నారు.