విజయ సాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
అమరావతి : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఆయన కొత్త పార్టీ పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. గతంలో వైసీపీలో ఆయన నెంబర్ 2 గా ఉన్నారు. తనతో విభేదాల కారణంగా బయటకు వచ్చారు. ఇటీవలే సజ్జల రామకృష్ణా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే స్వంత గూటికి చేరుతారని అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి బాంబు పేల్చారు విజయ సాయిరెడ్డి. ఇదిలా ఉండగా ప్రధాన పార్టీలను విమర్శిస్తూనే యువత సాధికారత, ఆర్థిక సంస్కరణలు, ఇంధన ధరల తగ్గింపు , ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో రాబోయే పార్టీ జెండా , కార్యక్రమాలకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన వంటి బలమైన రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ, అవి ప్రజల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మరో రాజకీయ పార్టీ అవసరం ఉంది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని “రెడ్ బుక్ పార్టీ”గా, వైసీపీని “రప్పా రప్పా పార్టీ”గా ఆయన అభివర్ణించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను విమర్శించడంతో పాటు, ప్రజాధనాన్ని దోచుకోవడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేవలం కుటుంబ ఆధిపత్యం కలిగిన సంస్థలుగా మారిపోవడంపై కూడా ఆయన ఆ రెండు పార్టీలను తప్పుబట్టారు. విమర్శకులపై కేసులు పెట్టడంపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను పోలి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ విధానాలు , భవిష్యత్తు ప్రణాళికలను విజయసాయి రెడ్డి వివరించారు. ఈ కొత్త పార్టీకి తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని ఆయన స్పష్టం చేశారు.