బీఆర్ఎస్ ఎమ్మెల్సీని సభ నుండి బహిష్కరించాలి : సీఎం
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో పౌరుల ప్రైవేట్ భూములను చేర్చడంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలు ప్రారంభించడానికి సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు నల్లని టీ-షర్టులు ధరించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో సభ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమను అడ్డుకుంటున్నప్పుడు స్వల్ప గాయమైందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసుల చర్యకు నిరసనగాఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర సభ్యులు తమ షర్టులను విప్పేశారు. అనంతరం పోలీసులు వారిని వాహనంలో అక్కడి నుండి తరలించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల నిరసనల దృష్ట్యా అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు; కీలక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు తక్షణమే క్షమాపణ చెప్పాలని, సభ నుండి బహిష్కరించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అవమానం కేవలం ప్రసాద్ కుమార్ వ్యక్తిగతమైనది మాత్రమే కాదని, ఇది స్పీకర్ పదవికి, సభకు , తెలంగాణ ప్రజల గౌరవానికి జరిగిన అవమానమని ఆయన పేర్కొన్నారు.