ఏపీకి నీళ్లు పోతున్నా పట్టించుకోని సర్కార్
నాగర్కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, నిరంజన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3 పంప్హౌస్ను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతున్నా మోటార్లు ఆన్ అవడం లేదన్నారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఈ పర్యటన చేపట్టాం అన్నారు. పాలమూరు రిజర్వాయర్లు పూర్తయ్యాయని, వాటిని మాత్రం నింపడం లేదన్నారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. మరో 10 శాతం పనులు పూర్తి చేస్తే రైతుల పొలాల్లోకి నీరు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. టెండర్లను రద్దు చేసి పనులను ముందుకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం నుంచి 37 టీఎంసీల నీరు వెళ్లినట్లు అధికారికంగా చెబుతున్నారు. కానీ వాస్తవంగా వెళ్లింది 70 టీఎంసీల నీరు. తెలంగాణకు మాత్రం 7 టీఎంసీల లోపే నీరు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అని మండిపడ్డారు. ఎల్లూరులో ఐదు మోటార్లు నడవాల్సి ఉండగా రెండు మాత్రమే నడుస్తున్నాయి. జొన్నలబోగడ వద్ద ఐదు మోటార్లు ఉంటే ఒకటి, రెండు మాత్రమే నడుస్తున్నాయి. గుడిపల్లి వద్ద ఐదు మోటార్లు ఉంటే ఒకటి, రెండు మాత్రమే నడుస్తున్నాయి. రాత్రి సమయంలో కాకుండా కేవలం పగటి పూట మాత్రమే మోటార్లు నడుపుతున్నారు. కరెంటు రావడం లేదనే కారణంతో మోటార్లు నడపడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకెళ్లేందుకు కరెంటును సాకుగా చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఆదిత్యనాథ్ ప్రణాళిక ప్రకారం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా బేసిన్లో ఉన్న వారికి నీరు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని పెన్నా బేసిన్లో ఉన్న పొలాలకు కృష్ణా నీటిని తీసుకెళ్తున్నారని వాపోయారు. ముచ్చిమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు రావాల్సిన 50 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించారని ఫైర్ అయ్యారు. వరద జలాల కోసం నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 8 వేల క్యూసెక్కుల నికర జలాలు పోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.