తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించను్నారు. ఈ సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి మ్యూజియంలోని పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని కళాకృతులను భక్తులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
భక్తులు సులభతరంగా ఫీడ్ బ్యాక్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఈనెల 13న శ్రీవారి దర్శనానికి సంబందించి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు ఈవో ముద్దాడ రవిచంద్ర.







