కోట్లు కురిపిస్తున్న ‘హనుమాన్ అంశ్’
ముంబై : ప్రస్తుతం భక్తి రస చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. బాలీవుడ్ ను ఏలుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఎలాంటి స్టార్ డమ్ లేకుండా రికార్డుల మోత మోగిస్తున్నాయి. 1975 నాటి “జై సంతోషి మా”, 1977 నాటి “షిర్డీ కే సాయిబాబా” నుండి 2024లో విష్ణుమూర్తి అవతారాలైన వరాహ , నరసింహుల గురించి వచ్చిన “మహావతార్ నరసింహ” వరకు వివిధ భాషల్లోని భక్తిరస చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. “మహావతార్” ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉండగా గత నెలలో చాలా తక్కువ హడావిడితో థియేటర్లలోకి వచ్చి, మొదటి వారంలో కేవలం రూ. 1.08 కోట్ల వసూళ్లు సాధించిన “హనుమాన్ అంశ్” చిత్రం ఇప్పుడు ఈ ఏడాది ఊహించని బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసింది. దివంగత బాబా నీమ్ కరోలీ జీవితం ఆధారంగా తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సాధించిన విజయం, 51 ఏళ్ల క్రితం వచ్చిన “జై సంతోషి మా” సృష్టించిన సంచలనాన్ని గుర్తు చేస్తోంది.
వైద్యుడు, చిత్ర నిర్మాత అయిన విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంతగా పరిచయం లేని శోభినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రం, ప్రదర్శితమయ్యే స్క్రీన్ల సంఖ్యను 250 నుండి 2,000కు పెంచుకుంది; అలాగే మొదటి రోజు రూ. 10 లక్షల వసూళ్లతో మొదలై ప్రస్తుతం భారతదేశంలో రూ. 200 కోట్ల (గ్రాస్) వసూళ్లను సాధించింది. “హనుమాన్ అంశ్” చిత్రం ఉత్తరాఖండ్కు చెందిన పూజ్యనీయ సాధువు బాబా నీమ్ కరోలీ జీవిత చరిత్రను ఆవిష్కరిస్తుంది . జూలియా రాబర్ట్స్, విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ వంటి ప్రముఖులు ఆయన భక్తులలో ఉన్నారు. స్టీవ్ జాబ్స్ , మార్క్ జుకర్బర్గ్ కూడా ఆ పర్వత ప్రాంత రాష్ట్రంలోని కైంచి ధామ్లో ఉన్న ఆయన ఆశ్రమాన్ని సందర్శించినట్లు సమాచారం.