సీఎం చంద్రబాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ( టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్రతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు, టీటీడీ బోర్డు సభ్యులు , ఆలయ అర్చకులు శనివారం అమరావతి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకిదేవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.