తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమలలో చేపట్టిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షం ఒకటి. కోరిన ఫలాలను ప్రసాదించే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తులకు సర్వాభీష్టాలను ప్రసాదించే దివ్యరూపంలో దర్శనమిచ్చారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశాల నుంచి తిరుమలలో కొలువుతీరిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అనే నామ స్మరణ వినిపిస్తోంది. తిరుమల కొండలు శ్రీవారి జపంతో తపించి పోతున్నాయి. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఉత్సవాలలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా పూజలు చేపట్టారు.






