తిరుపతి : వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా ఆరాధిస్తారని తెలిపారు. అలాంటి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నిజమే అని బలపరిచారని ఆరోపించారు ఎంపీ. అయితే నిజం ఏంటో , టీడీపీ, జనసేన పార్టీల భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని సీబీఐ, ఈడీ విచారణ సంస్థలు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు.
శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు పదార్థాలు లేనే లేవని మొన్న సీబీఐ, నేడు ఈడీ తేల్చి చెప్పిందన్నారు మద్దెల గురుమూర్తి. దీని ద్వారా కోట్లాది మంది హిందువులు మనసులోని భారాన్ని దించుకున్నారని పేర్కొన్నారు. కానీ కొన్ని నెలలపాటు తీవ్ర ఆవేదనకు గురి చేసిన చంద్రబాబు , పవన్కల్యాణ్ , అలాగే టీడీపీ, జనసేన నేతలంతా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి, కోట్లాది మంది హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలకు వెళ్లి దేవ దేవుని ఎదుట తప్పైందని చెంప లేసుకోవాలని అన్నారు. ఇది తన ఒక్కడి డిమాండ్ కాదని యావన్మంది హిందువుల డిమాండ్ అని పేర్కొన్నారు.






