న్యూఢిల్లీ : ఎఫ్ సీ ఆర్ ఏ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుని విమర్శలను తోసిపుచ్చింది విదేశీ వ్యవహారాల శాఖ. భారతదేశపు ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ లో ప్రతిపాదించిన సవరణలపై అమెరికా చట్టసభ సభ్యుడు రైలీ మూర్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. ఈ నిబంధనలు చర్చిలు , స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ నియంత్రణకు దారి తీయవచ్చని, అలాగే ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు. విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ అంశంపై విదేశాల నుండి వచ్చిన విమర్శలను తిరస్కరించింది. ఇది పూర్తిగా అంతర్గత వ్యవహారమని పేర్కొంది. దీనిపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలు విదేశీ నిధులు , ఆర్థిక లావాదేవీలను నియంత్రిస్తున్నాయని, విదేశాల నుండి వచ్చే నిధులను పర్యవేక్షించే పూర్తి హక్కు భారతదేశానికి ఉందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నొక్కి చెప్పారు.
ఎఫ్ సీ ఆర్ ఏలో ప్రతిపాదించిన మార్పులు క్రైస్తవులపై స్పష్టమైన దాడి అని పేర్కొంటూ, ప్రస్తుత రూపంలో ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లవద్దని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ కోరారు. వెస్ట్ వర్జీనియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మూర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇలా అన్నారు. యేసు క్రీస్తు పునరుత్థానం జరిగిన కొద్ది దశాబ్దాలకే సెయింట్ థామస్ అపోస్టల్ మలబార్ తీరానికి వచ్చినప్పటి నుండి భారతదేశంలో క్రైస్తవులు నివసిస్తున్నారు. ఇంత సుదీర్ఘమైన క్రైస్తవ చరిత్ర ఉన్నప్పటికీ చర్చిలు , మతపరమైన స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అనుమతించేందుకు భారత పార్లమెంటు ఎఫ్ సీ ఆర్ ఏ నిబంధనలను సవరించడాన్ని పరిశీలిస్తోంది. ఇది క్రైస్తవులపై స్పష్టమైన దాడి. ఈ బిల్లు ఇదే విధంగా ముందుకు సాగితే, భారతదేశంతో మన ద్వైపాక్షిక సంబంధాలలో ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.






