హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్లో డిజిటలైజేషన్ను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పాలనలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ , డిజిటల్ ప్లాట్ఫారమ్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఏఐ ట్రాన్స్ఫార్మేషన్ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. కాగిత రహిత ఈ-గవర్నెన్స్ లక్ష్యంతో శాసనసభ , శాసనమండలి కార్యకలాపాలలో డిజిటలైజేషన్ను భారీగా ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఆఫీస్’ ప్రాజెక్ట్ కాగిత రహిత పాలనను వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పాలనలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ , డిజిటల్ ప్లాట్ఫారమ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ‘రియల్-టైమ్ గవర్నమెంట్ డాష్బోర్డ్’ 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపై అనుసంధానిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన టి – ఫైబర్ ద్వారా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. వృద్ధులు , దివ్యాంగుల కోసం ఇంటి వద్దకే సేవలు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. బ్లాక్చెయిన్ ఆధారిత ధృవీకరణ పత్రాల సేవలను కూడా త్వరలో ప్రవేశ పెడతామని మంత్రి తెలిపారు. కాగిత రహిత పాలనలో భాగంగా ఈ ఏడాది జూన్లోనే రాష్ట్ర ప్రభుత్వం కాగిత రహిత మంత్రివర్గ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని ప్రకటించారు శ్రీధర్ బాబు. జూన్ 18న సచివాలయంలో జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో ప్రత్యేక ట్యాబ్లను అందజేశామన్నారు.






