హైదరాబాద్ : ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తెలంగాణలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై బాంబు పేల్చారు. ఎవరూ కూల్చాల్సిన పని లేదని , బీజేపీ తుమ్మితే చాలు కూలి పోతుందని ఎద్దేవా చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో కలిసి ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. తానే దీనికి నాయకత్వం వహిస్తానని అన్నారు. ఒకవేళ ఎంఐఎం నాయకులకు దమ్ముంటే దీన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు బండి సంజయ్ కుమార్ పటేల్. ‘వందేమాతరం’ గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారని హెచ్చరించారు.
చట్టం ప్రకారం వ్యవహరిస్తున్న మమ్మల్ని మీరు మతోన్మాదులని అంటే ఎలా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలను ఎందుకు ముద్రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య హయాంలో వందల కోట్ల విలువైన స్మార్ట్ కార్డులు నిరుపయోగంగా మారాయని, అయినా ఇక్కడ అలాంటి కార్డులను తీసుకు రావడంలో ఉన్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి. తెలంగాణలో దాదాపు 2 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోందన్నారు. మరి రేషన్ కార్డులపై మోదీ ఫోటో ఎందుకు ముద్రించడం లేదన్నారు. కేంద్రం అందించే బియ్యం మీకు అవసరం లేదా అని ఫైర్ అయ్యారు బండి సంజయ్ కుమార్ పటేల్.






