హైదరాబాద్ : మత్స్య సహకార సంఘాల ఎన్నికల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ములుగు జిల్లాకు చెందిన సాధు రఘు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సురేపల్లి నంద ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తాము సమర్పించిన వినతులపై అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడాన్ని సవాలు చేస్తూ వారు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలి ఉన్న ప్రాథమిక , జిల్లా స్థాయి మత్స్య సహకార సంఘాల ఎన్నికల్లో జాప్యం లేకుండా చూడాలని, మూడు వారాల్లోగా వాటి పాలక వర్గాలను ప్రజాస్వామ్య యుతంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.ఎల్. పాండు వాదిస్తూ, ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ను పాటించాలని లేదా దానిని అమలు చేయడం సాధ్యం కాకపోతే కొత్త షెడ్యూల్ను జారీ చేసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోర్టు గతంలో అధికారులను ఆదేశించిందని గుర్తు చేశారు.
పిటిషనర్ల వినతులను పరిశీలించిన కోర్టు మూడు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, 2019 ఖరీఫ్ , రబీ సీజన్లకు సంబంధించి కొంతమంది రైతులకు ‘రైతు బంధు’ పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన పిటిషనర్ రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాలని 2024 సెప్టెంబర్లో సింగిల్ జడ్జి ఆదేశించారు. ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్షా పిటిషన్ను కూడా సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. 2019 ఖరీఫ్ సీజన్లో 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించామని, 2019 రబీ సీజన్లో నిధుల లభ్యతను బట్టి ఆరు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పరిమితం చేశామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. పిటిషనర్లు నిర్ణీత పరిమితి కంటే చాలా ఎక్కువ భూమిని కలిగి ఉన్నందున, ఆ సీజన్లకు సంబంధించి ఈ ప్రయోజనాన్ని పొందే అర్హత వారికి లేదని ప్రభుత్వం పేర్కొంది.





