అమరావతి : రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678లను చెల్లించారు. వివిధ శాఖలు, గురుకులాల పాఠశాలలకు సరఫరా చేసిన చేనేత లివరీ వస్త్రాలకు సంబంధించి ఈ చెల్లింపులు ఉన్నాయి. 20 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆ చెల్లింపులను జమ చేశారు. త్వరలో మిగిలిన బకాయిలను కూడా చెల్లించేలా చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిశా నిర్దేశంలో చేనేత సహకార సంఘాలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రత్యేక దృష్టి సారించారు.
చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతంలో భాగంగా ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోళ్లు జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేటి తరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏయే వస్త్రాలు కావాలో ఆయా సంఘాలకు ఆప్కో ద్వారా ఆర్డర్లు అందజేస్తున్నారు. అదే సమయంలో ఆయా సంఘాల నేతలతోనూ సమావేశమై వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలు తయారు చేయాలని సూచిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి తక్షణ చెల్లింపులు చేసేలా ఆప్కో అధికారులతో మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆప్కో చరిత్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బకాయిల్లేకుండా మంత్రి సవిత తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి





