వైద్య, విద్్యా రంగాలను నిర్వీర్యం చేశారు
న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు (ఎంపీ) మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఏపీలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు. వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో కొత్తగా కూటమి సర్కార్ వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వక పోవడంతో దాదాపు 1000 సీట్లను కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ గురుమూర్తి.
ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం లాభాపేక్షతో పనిచేస్తాయని, అదే జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో ప్రజలకు వైద్య సేవలు దూరమవుతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలకు వెంటనే అనుమతులు మంజూరు చేసి, ఏపీలో ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేద కుటుంబాలకు, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు ఏపీ సర్కార్ కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ గురుమూర్తి.






