ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి ప్రసాద్. హస్త కళలకు సంబంధించి తయారు చేసే ఉత్పత్తిదారులకు మేలు చేకూర్చేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వని పెంటలో గురు శిష్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ప్రసంగించారు. గురు–శిష్య శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30 మంది శిక్షార్థులకు రెండు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడం జరుగుతుందని చెప్పారు హరి ప్రసాద్. గురువులుగా శ్రీనివాస్, ప్రకాష్, వెంకటేశ్వర్లు వంటి అనుభవజ్ఞులు శిక్షణ అందించనున్నారు. గురువు అనేది తల్లిదండ్రులతో సమానం అన్నారు. శిష్యుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువే అని హరిప్రసాద్ చెప్పారు.
హస్తకళలను పరిరక్షించడం, కళాకారుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడం, వారి వస్తువుల విలువ పెంచడం, ODOP కార్యక్రమాన్ని మరింత విస్తరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. వనిపెంట కళాకారులు సొంత ఇళ్లలో నుంచే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించే స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు హరి ప్రసాద్ . వారి తయారీ ఉత్పత్తులకు తగిన ధర లభించేలా లేపాక్షి ద్వారా పూర్తి సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం, కార్పొరేషన్, సమాజం, కళాకారులు ఒకటిగా ముందుకు సాగాలని హరిప్రసాద్ పిలుపునిచ్చారు.






