స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి
అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ హస్త కళలపై దృష్టి సారించిందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే అవార్డులు వరించాయన్నారు. కళాకారుల సంక్షేమంతో పాటు హస్తకళా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందని చెప్పారు ఎస్. సవిత. హస్త కళాకారులకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవ ప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
హస్త కళల రంగానికి విశేష ప్రోత్సాహం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డులు అందుకున్న కళాకారులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు అందిన స్ఫూర్తితో హస్త కళలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా అవార్డు గ్రహీతలకు ఈ నెల 13న శ్రీకాళహస్తిలో సన్మానించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాగంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇదే కార్యక్రమంలో వంద మంది హస్త కళాకారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల విలువ చేసే టూల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు సవిత వెల్లడించారు.






