సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : ముసారాం బాగ్ వంతెన పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా అంబర్ పేటలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. ముసారాం బాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. మలక్ పేట్, అంబర్ పేట్ మధ్య మూడేళ్ల క్రితం హై లెవల్ బ్రిడ్జి కోసం పనులు ప్రారంభించారని, కానీ ప్రభుత్వం మారగానే ఈ బ్రిడ్జి పనులను ఆపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అటు మొన్న వచ్చిన వరదకు కూడా బ్రిడ్జి ఎత్తు ఆనుకొని నీళ్లు ప్రవహించాయన్నారు. కనుక ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎంపీ కూడా వరద ఎత్తుకు తగిన విధంగా బ్రిడ్జి ఎత్తు పెంచే ప్రయత్నం చేయాలని కోరారు కల్వకుంట్ల కవిత.
అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా పెరిగి పోయిందన్నారు. ట్రాఫిక్ నివారణ కోసం ఈ ప్రాంతంలో మరో బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు . ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఆ వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత .ఈ ప్రాంతంలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం మారగానే పనులు ఆపటం మంచిది కాదన్నారు. ఈ పనులు ప్రజల కోసమని గమనించాలని అన్నారు. ఇక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్నా చేసైనా సరే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.






