అన్ని వర్గాలకు కార్పొరేషన్లకు నిధులు
అమరావతి : కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుపెద్దపీట వేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా స్థాయి కాపు భవనాలను, 487 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను గాలి కొదిలేసిందన్నారు. తొమ్మి ది జిల్లా స్థాయి కాపు భవనాలను మరియు 421 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నం, నెల్లూరు జిల్లా స్థాయి కాపు భవనాలను, అయిదు కాపు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. 50 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన తిరుపతి, కర్నూలు జిల్లా స్థాయి కాపు భవనాలను, 70 శాతం పూర్తయిన 39 కాపు మినీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి కవిత. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.
విదేశాల్లో చదువుకోవాలనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కల నెరవేరుస్తూ, విదేశీ విద్యా పథకానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 2014-19 మధ్య అయిదేళ్లలో 2,234 విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించారన్నారు. ఇందుకోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.244 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చారన్నారు. నిబంధనల పేరుతో కేవలం 60 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య చదువుకునే అవకాశం కల్పించారన్నారు. నూతన విధానంలో విదేశీ విద్యా పథకానికి పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు.






