దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె
అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన కల్పతరువు లాంటి పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో కీలక మార్పులు చేయడం పట్ల మండిపడ్డారు. దీని కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.
పేరు మార్చడంతో పాటు నిబంధనలలో కూడా మార్పులు చేయడాన్ని తప్పు పట్టారు. ఇప్పటి వరకు కేంద్రం నిధులను భరించేదని కానీ తాజాగా చేసిన బిల్లులో 40 శాతం ఆయా రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేయడాన్ని నిరసించారు. దీనిని తాము తప్పు పడుతున్నట్లు పేర్కొన్నారు తపన్ కుమార్ సేన్. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ సీఐటీయూ వచ్చే ఫిబ్రవరి 12వ తేదీన సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపీ. రోజు రోజుకు ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను , నిర్ణయాలను తీసుకు రావడం దారుణమన్నారు.






