నేను ఏ తప్పు చేయలేదన్న మాజీ మంత్రి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ప్రతి ఒక్కరి ఫోన్ ను ట్యాప్ చేయడం జరుగుతుందన్నారు. ఇది విధుల్లో భాగమేనని పేర్కొన్నారు. తనకు నోటీసులు ఇవ్వడంపై మీడియాతో మాట్లాడారు కేటీఆర్. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇదంతా బక్వాస్ కేసు అంటూ కొట్టి పారేశారు.
ముందు నా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అడుగుతానని అన్నారు. ఉత్తమ్ రెడ్డి స్వయంగా ఒక జర్నలిస్ట్ తో చెప్పాడు కదా నా ఫోన్ ట్యాప్ అవుతుందని..సిట్ వేశావా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ముగ్గురు మంత్రుల వాటాల గొడవలో దొంతు రమేష్ లాంటి జర్నలిస్టులను బలి చేశారని ఆరోపించారు కేటీఆర్. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డి ను విచారించారా అని నిలదీశారు.
మిగతా పోలీసు ఉన్నతాధికారులను విచారించారా అని అన్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతుందో తెలుసుకోకుండా సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.






