మహిళను మోసం చేసిన విషయంపై నివేదిక ఇవ్వాలి
విజయవాడ : జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు ఇప్పుడు ఏపీని కుదిపి వేస్తున్నాయి. దీంతో బాధితురాలు బయటకు రావడం, తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, వీడియోలను బయటకు విడుదల చేసింది. అంతే కాదు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఏకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసింది. తక్షణమే దీనిపై విచారణకు ఆదేశించాలని విన్నవించింది. తాజాగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది జనసేన పార్టీ.
ఇదిలా ఉండగా ఈ గందరగోళానికి మరింత ఆజ్యం పోస్తూ, ఆ మహిళకు చెందినదిగా భావిస్తున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియో క్లిప్లో, శ్రీధర్ గత 18 నెలలుగా తనను లైంగికంగా వేధించాడని , నిరంతరం చిత్రహింసలకు గురిచేశాడని ఆమె ఆరోపించింది.
ఆ ఎమ్మెల్యే తనతో టెలిగ్రామ్ యాప్ ద్వారానే సంభాషించాలని బలవంతం చేశాడని, వీడియో కాల్స్లో నగ్న ప్రదర్శనలు కోరాడని, పదే పదే అనుచితమైన డిమాండ్లు చేశాడని బాధితురాలు వాపోయింది.
అతని ప్రవర్తనలోని ఔచిత్యాన్ని ప్రశ్నించినప్పుడల్లా, ఒత్తిడి మరింత పెరిగిందని ఆమె పేర్కొంది.
రైల్వే కోడూరు నుండి తన బదిలీ అభ్యర్థనను అడ్డుకుంటానని ఎమ్మెల్యే బెదిరించాడని, డిపార్ట్మెంట్ స్థాయిలో విచారణలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడని ఆ మహిళ ఆరోపించింది. తాను తన కొడుకుతో ఒంటరిగా నివసిస్తున్నానని అతను పదే పదే గుర్తుచేశాడని ఆమె పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.






