ఇలాగైతే కష్టమని షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు అడుగులు మడుగులు ఒత్తుతూ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వంత పాడుతూ వచ్చిన తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ముద్దసాని కోదండరాం రెడ్డి ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంటున్నారా. తాను చేసింది తప్పేనని గ్రహించారా. తాజాగా ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ హెచ్చరించారు. తమ పనితీరు మార్చుకోక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత పెరగడంతో కోదండరాం రెడ్డి గుస్సా అయ్యారు.
పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కోదండరాం రెడ్డి. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని కోదండరాం హాట్ కామెంట్స్ చేశారు. మిత్ర పక్షమైన టీజేఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోగా, స్థానిక ఎన్నికల్లో సీట్లపై చర్చ జరగలేదని వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి కోర్టు పరిధిలో ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు కోదండరాం రెడ్డి.






