పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఆయన కొద్ది సేపు ఉన్నారు. జంతువుల సంరక్షణ గురించి ఆరా తీశారు. తన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా జూపార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటానని స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన ఇప్పటికే పేద పిల్లలు, వృద్దుల సంరక్షణ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. తనలో సామాజిక కోణం కూడా ఉందని చాటి చెప్పారు డిప్యూటీ సీఎం.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రెండు జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటించారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు.
జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు.






