స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : సంజీవని ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు సమీక్షకు హాజరయ్యారు.
ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగు పర్చేలా క్షేత్ర స్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో వైద్యా రోగ్య శాఖపై కూడా సమీక్షించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్న క్రమంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మంత్రి సత్యకుమార్, ఉన్నతాధికారులు సమావేశం లో పాల్గొన్నారు.






