హైదరాబాద్ నగరంలో నిబంధనలు పాటించరు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుండడంతో హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, నీటి పారుదల, ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు చేపట్టింది. విస్తృతంగా తనిఖీలు కూడా నిర్వహించింది. గత కొన్ని రోజులుగా హైడ్రా తనిఖీలతో హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా నిబంధనలు పాటించని ఆరు షాపులకు తాళం వేసింది. గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్ బిల్డింగ్ ను అధికారులు సీజ్ చేశారు. సెల్లార్లర్లో అగ్నిప్రమాదానికి ఆస్కారం ఉండే నిలువలు ఉంచినట్టు నిర్ధారించారు. పెయింట్ డబ్బులు, పరుపులు, బ్యాటరీలు, పెద్ద మొత్తంలో నిలువ ఉంచినట్టు గుర్తించారు.
అనుమతి లేని భవనం తోడు ఫైర్ అనుమతులు కూడా లేని పరిస్థితి. సెల్లార్ల ర్యాంపులు మూసేసి స్టాక్ తో నింపినట్టు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇదే పరిస్థితి కొంపల్లి క్రాస్ రోడ్స్ లోని అను ఫర్నిచర్ షో రూంలో కూడా నెలకొంది. కూకట్పల్లితో పాటు అత్తాపూర్లోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేలో ఉన్న రోయల్ ఓక్ ఫర్నీచర్ షాపులు కూడా నిలువలు ప్రమాదకరంగా సెల్లార్లలో నింపేయడంతో అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ నాగోల్లోని బాంటియా ఫర్నీచర్ షోరూం, నాచారంలోని అను ఫర్నీచర్ షోరూంను సీజ్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ షాపుల పరిసరాలు ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతంగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు.






