స్పష్టం చేసిన టీటీడీ జేఈవో డాక్టర్ శరత్
తిరుపతి : శ్రీవారి వైద్య సేవకు సంబంధించిన యాప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వైద్యం, విద్యా రంగాలకు సంబంధించిన జేఈవో డాక్టర్ శరత్ . తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన శ్రీ వారి వైద్య సేవపై టిటిడి ఆరోగ్యం, విద్య విభాగాలసంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన నిపుణులు లేదా వైద్యుల సంఖ్యపై నివేదిక రూపొందించాలని సంబంధిత విభాగాధిపతులను ఆయన ఆదేశించారు.
అలాగే శ్రీ వారి వైద్య సేవ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్లో అవసరమైతే మార్పులు చేయాలని జీఎం ఐటీ ఫణికుమార్ నాయుడును జెఈఓ సూచించారు. ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్.వి. కుమార్, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ సీఎంఓ డా. కుసుమ కుమారి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట రెడ్డి, ఎస్ఈ మనోహరం, చీఫ్ పీఆర్వో డా. రవి తదితరులు పాల్గొన్నారు.







