ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి
తాడేపల్లి గూడెం : తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు.
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? అని అన్నారు. ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్రాజ్’’గా మారిపోయింది వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం.
చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారంటూ ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు పై హత్యా యత్నానికి పాల్పడడం, ఇంటిని, కారుకు నిప్పంటించడంతో పాటు విజయవాడలో జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు జగన్ రెడ్డి. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇకనుంచైనా మానుకోవాలని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం అన్నారు.






