పార్కులను ప్లాట్లుగా మార్చేశారంటూ ఆరోపణలు
హైదరాబాద్ : కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి చేపట్టారు. మొత్తం 65 ఫిర్యాదులు అందాయని చెప్పారు ఈ సందర్భంగా. రంగారెడ్డి జిల్లా భాగ్ హయత్నగర్ సర్వే నంబరు 97లో శ్రీ రాంనగర్ కాలనీలో 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులు కబ్జాకు గురౌతున్నాయని కాలనీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కుల కోసం కేటాయించిన స్థలాలను ప్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నారని, ఇలా ఈ కాలనీలో నాలుగు చోట్ల కబ్జాలు జరుగుతున్నాయని.. వెంటనే పార్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కోరారు. ఇదే జిల్లాలోని సరూర్నగర్ మండలం, చంపాపేట్ విలేజ్లోని దుర్గాభవానీ నగర్లో361 గజాల పార్కు ఇంటి స్థలంగా మారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మెడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సుభాష్ నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో పార్కు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు ఆక్రమణలు జరుగుతున్నాయని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. కాలనీలో ప్లాట్ నంబర్లు 317–318, 284–285, 265–266, 259–260, 320 సమీపం లోని పార్కులతో పాటు.. 336–337 మధ్య ఉన్న మొత్తం 6 పార్కులు, ఓపెన్ ప్లేస్లు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. గతంలో GHMC కాంపౌండ్ వాల్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో పనులు ఆగిపోయాయని కాలనీ వాసులు వాపోయారు.






