భక్తులకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశం
అమరావతి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పవిత్రమైన శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాగునీరు, రవాణా, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా వంటి కనీస వసతుల్లో ఎక్కడా లోటు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతకు పెద్దపీట వేయాలని తెలిపారు. ఆలయ కమిటీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు కింజారపు అచ్చెన్నాయుడు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు.








