హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ | బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే పాలనగా కొనసాగుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 9, 10, 11, 16, 17, 18, 19, 20,29, 4, 5 వార్డులతో పాటు హుజురాబాద్ పట్టణంలోని 8, 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పర్యటించారు. ఈ సందర్బంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.
హుజురాబాద్–జమ్మికుంట ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చూసినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ అభివృద్ధి, మౌలిక వసతులు , పేదల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, వృద్ధులు–వితంతువులు–వికలాంగులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు నిజమైన భరోసాగా నిలిచాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాకుండా మిగిలి పోయాయని, ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, ప్రజల అభివృద్ధి కన్నా రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు.





