మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. మహబూబ్ నగర్ లో ఆయన డీసీసీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ పై భగ్గుమన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. 2019లో ప్రొడ్యూసర్ లేక ఒక్క సీటు కూడా గెలవలేదంటూ ఎద్దేవా చేశారు. 2024లో ప్రొడ్యూసర్ చంద్రబాబు, కో ప్రొడ్యూసర్ నారా లోకేష్ దొరికిన తరువాత పవన్ కళ్యాణ్ గెలిచిండని లేకపోతే ఓడి పోయే ఉండేవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనిరుధ్ రెడ్డి.
నా కుటుంబం పెద్దది అయిందని ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మోదీని తెచ్చుకున్నాడంటూ ఫైర్ అయ్యారు. వీళ్లందరి కళ్లు పచ్చని తెలంగాణ భూములపై పడిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రాలో భూములకు ధరలు లేవన్నారు. అందుకే వీరంతా గంపగుత్తగా తెలంగాణపై పడ్డారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తెలంగాణోళ్లకు నర దిష్టి ఉందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశాడని, ఆయన పార్టీ నుండి ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నించారు . ఇదేనా మీకున్న తెలంగాణ నిబద్దత అంటూ నిలదీశారు.






