ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. 2014-18లో పాల ఉత్పత్తి 11.72% వృద్ధి సాధించగా, 2019-23లో (-)2.15% నెగెటివ్ వృద్ధి నమోదైందన్నారు. 2014-15లో 96.56 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2019 నాటికి 150 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి, 2024 నాటికి 139 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిందని తెలిపారు. అలాగే మాంసపు ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తిలో కూడా గతంలో నెగెటివ్ వృద్ధి నమోదైందని విమర్శించారు. 2014-19లో సంవత్సరానికి మూడు సార్లు నిర్వహించిన నట్టల నివారణను, ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తూ రూ.25 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26.55 లక్షల కృత్రిమ గర్భధారణలు చేపట్టి, లింగ నిర్ధారిత వీర్య నాళికల ద్వారా 9,793 పెయ్య దూడలు ఉత్పత్తి చేశామని తెలిపారు.
3.68 కోట్ల వ్యాధి నిరోధక టీకాలు, 1.71 కోట్ల గొర్రెలు/మేకలకు నట్టల నివారణ మందులు అందించామని చెప్పారు. 11 లక్షల పశువులకు రూ.29 కోట్లతో వైద్య శిబిరాలు నిర్వహించి 5.36 లక్షల పాడి రైతులకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. MGNREGS అనుసంధానంతో 36,016 గోకులాలు మంజూరు చేసి, 2026-27లో 50,000 గోకులాల నిర్మాణ లక్ష్యాన్ని నిర్ణయించామని తెలిపారు. 265 కోట్ల RIDF నిధులతో 400 కొత్త వెటర్నరీ భవనాలు, 37.4 కోట్లతో 426 భవనాల మరమ్మత్తులు చేపడుతున్నామని చెప్పారు. మూలన పడిన 340 మొబైల్ వెటర్నరీ వాహనాలను తిరిగి వినియోగంలోకి తీసుకు వచ్చామని పేర్కొన్నారు. వీధి పశువుల రక్షణ కోసం జిల్లాకు ఐదు చొప్పున గోశాలల నిర్మాణానికి రూ.13 కోట్లు ప్రతిపాదించామని వెల్లడించారు. పశువు మరణిస్తే ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50,000కు పెంచామని తెలిపారు. పశు బీమా ప్రీమియంలో రైతు వాటాను 50% నుంచి 15%కు తగ్గించి, 85%ను ప్రభుత్వమే భరిస్తోందన్నారు.






