స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలన్నారు. ఇదే విధంగా హైదరాబాద్ ను ప్రమోట్ చేయడం వల్లే ISB వచ్చిందన్నారు సీఎం. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.
తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంత మేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం అని పేర్కొన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హిందుపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందుకే పర్యాటకానికి పారిశ్రామిక హోదాను కల్పించామన్నారు. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీలో అనేక చరిత్రాత్మక ప్రాంతాలు.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేసే అంశంపై ఫోకస్ పెట్టాలన్నారు.






