చెరువుల జోలికి రావడం లేదన్న కమిషనర్
హైదరాబాద్ : హైడ్రా చర్యలతో రియల్టర్లతో పాటు ఇతరులు ఎవరూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లే ఔట్లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సేవలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించు కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2006లో ఉన్న ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన డెమ్ (డిజిటల్ మోడల్ ఎలివేషన్) డేటాతో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్లను నిర్ధారించడం జరుగుతోందని అన్నారు. అవసరమైతే 1970, 1990ల నాటి డేటాను కూడా తాము వినియోగించు కుంటామని చెప్పారు. ఓఆర్ ఆర్ పరిధిలో సుమారు 13,500 ఎకరాల ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూమిని కాపాడామని వెల్లడించారు. దీని విలువ దాదాపు రూ. 70,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని చెరువుల నీటి నాణ్యతపై ఉపగ్రహ ఆధారిత అధ్యయనాలు నిర్వహించేందుకు NRSC సహకరించాలని హైడ్రా కమిషనర్ కోరారు. ఈ అధ్యయనాలు కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడంతో పాటు శాస్త్రీయ ఆధారాలతో సరస్సుల పునరుద్ధరణ చర్యలకు సహాయ పడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో జల సంరక్షణ కీలకమైనదని.. నీటి వనరులను కాపాడడంలో హైడ్రా చొరవ అభినందనీయమని ఇస్రో ఛైర్మెన్ డా. వి. నారాయణన్ అన్నారు. సదస్సులో వర్చ్యువల్ ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞనాన్ని సామాన్యులకు చేరవేయడంలో హైడ్రా చొరవ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.







