ప్రజా సమస్యలకు పవన్ పరిష్కారం
అమరావతి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించారు. ఓనూరు ప్రాథమిక పాఠశాలను స్వయంగా పరిశీలించారు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఓనూరు వెళ్లాలని నందిగరువు గ్రామస్థులు ఆవేదన చెందారు. వారి వేదనను గుర్తించిన పవన్ కళ్యాణ్ వెంటనే నందిగరువు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీబీ జీరామ్ జీ పథకం నిధులతో ఓనూరు – కొత్తపలం రోడ్డుకు అనుమతులు ఇచ్చారు. అలాగే కొత్తపలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నర్తనపల్లి, ఓనూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి జల్ జీవన్ మిషన్ పథకం నిధులతో సమస్యను పరిష్కరిస్తాం అని ప్రకటించారు.





