సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన షర్మిల
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం, ఆపై పోలీసులపై కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఈగిల్ టీం ఎస్పీ గిరింధర్ వెల్లడించారని తెలిపారు షర్మిలా రెడ్డి. డ్రగ్స్ టెస్టులో ఏపీలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్ తేలిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ దొరకడం సిగ్గు చేటు అన్నారు షర్మిలా రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తుండడం దారుణమన్నారు. మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నది డ్రగ్స్ సేవించడానికి కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించడం కాదా అని ప్రశ్నించారు.
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతా రాహిత్యం అని నిలదీశారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ? యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా? అని భగ్గుమన్నారు.





